Showing posts with label పంచతంత్రం కథలు. Show all posts
Showing posts with label పంచతంత్రం కథలు. Show all posts

Friday, June 1, 2007

సింహము ~ కుందేలు


పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద సింహం నివసిస్తూ ఉండేది. అది రోజు దాని ఆకలి తీర్చుకోడానికి ఆ అడవిలోని అనేక జంతువులను చంపి తింటూ వుండేది.

దానితో అడవిలోని జంతువులన్నిటికి, ఇలా అయితే కొన్నాళ్ళకి తమలో ఏ ఒక్కటి ప్రాణాలతో మిగలవని భయం పట్టుకుంది. అందువల్ల అవి అన్నీ కలిసి సింహంతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాయి.

మొత్తం అడవిలో జంతువులన్నీ కలసి సింహం దగ్గరకి రావడం చూసి సింహం మహ సంబర పడిపోయింది. తను కష్టపడి వాటిని వెంటాడి వేటాడే పని లేకుండా అవే తన దగ్గరకు రావడం సింహానికి సంతోషాన్ని కలిగించింది.

ఇంతలో వాటిలో ఒక జంతువు సింహం ముందుకు వచ్చి ముందుగా తాము చెప్పబోయే మాట ఒక్కసారి వినమని అభ్యర్దించింది. "సరే" అంది సింహం గంభీరంగా. "అయ్యా ! మీరు ఈ అరణ్యానికి రారాజు. మేము మీ రాజ్యంలోని సామాన్య జంతువులం. మిమ్మల్ని ఎదురించే శక్తి మాలో ఏ ఒక్కరికి లేదు. మీరు గనుక మమ్మల్నందరిని ఒకేసారి చంపేస్తే ఇక మీరు ఎవరికి రాజు గా వుంటారు? మిమ్మల్ని రాజుగా గౌరవించే వాళ్ళు, భయపడే వాళ్ళు ఎవరుంటారు?అందువల్ల మా అంతట మేమే రోజుకొకరం చొప్పున మీ దగ్గరకి ఆహారంగా వస్తాం".
ఈ ఒప్పందానికి ఒప్పుకుంది సింహం. కాకపోతే తనకి ఏ ఒక్క రోజైనా ఆహారం అందించకుండా ఒప్పంద ఉల్లంఘన జరిగితే మాత్రం మొత్తం అన్ని జంతువులను చంపేస్తానని హెచ్చరించింది.

ఆ రోజు నుండి అడవిలోని జంతువులలో రోజుకి ఒక జంతువు సింహానికి ఆహారంగా పంపబడుతోంది. సింహం కష్ట పడక్కరలేకుండా హాయిగా కాలం గడిపేస్తోంది.

అలా రోజులు గడుస్తుండగా ఒక రోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది మన సింహరాజుకి ఆహారంగా వెళ్ళడానికి. చూస్తూ చూస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడం ఎవరికి మాత్రం సరదా. అలాగే ఆ కుందేలుకి కూడా సింహానికి ఆహారంగా మారడానికి సుతారమూ మనసు ఒప్పలేదు. అందులోనూ ఈ కుందేలు చాలా తెలివైనది కావడం వల్ల తన ప్రాణాలే కాక అడవిలోని మిగతా జంతువులన్నిటి ప్రాణాలు కూడా కాపాడే పథకం ఒకటి వేసింది.

సరే, కుందేలు మెల్లిగా నడుచుకుంటూ సింహపు గుహలోకి అడుగు పెట్టింది. అప్పటికే మంచి ఆకలితో అటూ ఇటూ పచార్లు చేస్తున్న మన సింహానికి ఒక చిన్న కుందేలు ఆహారంగా రావడం చూసి పట్టలేని కోపం వచ్చింది. ఇక ఇలా లాభం లేదని మొత్తం అన్ని జంతువులను చంపేస్తానని కోపంగా అక్కడనుండి బయలుదేరుతున్న సింహాన్ని ఆపి ఇలా అన్నది కుందేలు "రాజా! నిజానికి మా వాళ్ళు ఈ రోజు మీకు ఆహారంగా ఆరు(6) కుందేళ్ళని పంపాయి. కాని మిగతా ఐదు(5) కుందేళ్ళని మరొక సింహం చంపి తినేసింది".కోపంతో బిగ్గరగా గర్జించింది సింహం. తన ఆహారాన్నే చంపి తిన్న ఆ మరొక సింహం ఎవరో వెంటనే తెలుసుకోవాలనుకున్నది.

కుందేలు మన సింహరాజుని ఇంకా రెచ్చగొట్టడం కోసం ఆ మరో సింహం చాలా పెద్దదని, పైగా ఈ అడవికి రాజు నువ్వా? - నేనా? తేల్చుకుందాం, ధైర్యం ఉంటే రమ్మందని మొదలైన మాటలు చెప్పడం ప్రారంభించింది. దానితో ఇంక కోపం పట్టలేని సింహరాజు కుందేలుతో తనని వెనువెంటనే ఆ మరో సింహం దగ్గరకు తీసుకెళ్ళమంది దాన్ని చంపటానికి.

కుందేలు సింహరాజుని తన వెంట ఒక లోతైన పెద్ద బావి వద్దకు తీసుకెళ్ళి ఆ మరో సింహం ఆ బావిలో వుందని చెప్పింది. సింహం బావి లోకి తొంగి చూసింది. బావిలో కనపడుతున్న తన ప్రతిబింబం చూసి అది ఆ మరో సింహం అని అనుకుని కోపంతో పెద్దగా గర్జించింది. బావిలోని ప్రతిబింబం కూడా గర్జించించినట్టు కనపడ్డమే కాక తన గర్జన ప్రతిధ్వని విని అది బావిలోని సింహపు అరుపుగా భ్రమించింది.

ఇక వెంటనే దానితో కలబడదామని నిర్ణయించుకుని బావిలోకి దూకింది మన సింహరాజు. ఇంకేముంది, బావిలోని బండరాయికి తల కొట్టుకోడంతో అక్కడికక్కడే చనిపోయింది సింహం.

అటుపై కుందేలు తనవారిని చేరుకుని అందరూ కలిసి హాయిగా జీవించారు.

మూలం : పంచతంత్రం కథలు

Tuesday, April 24, 2007

కోతులు - పాలపిట్ట


















.............................................................................................................................
మూర్ఖులకు మంచి మాటలు, మంచి సలహాలు చెవికెక్కవు. అలాంటి వాళ్ళకి సలహాలు చెప్పటం వృధా ప్రయాస మాత్రమేకాదు. ఒక్కోక్కసారి ప్రాణాలకు కూడా ముప్పు కలుగవచ్చు. అందుకనే సాధ్యమయినంత వరకు మూర్ఖులకు దూరంగా ఉండటం ఉత్తమం. మూర్ఖులైన కోతిమూకకి ఓ సలహా ఇవ్వబోయి తన ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి వైనం ఈకధలో తెలిసుకుందాం.
పూర్వం ఓ కొండ ప్రాంతంలో ఓ కోతుల గుంపు ఉండేది. అవి కొండ క్రిందునున్న గ్రామాలలోకి దండుగా వచ్చి దొరికినంత ఆహారం తిని మిగిలిన ఆహారాన్ని పట్టుకుపోయి కొండ ప్రాంతంలోని తమ స్ధావరంలో దాచుకుని వచ్చినన్ని రోజులు తిని మళ్ళీ యధావిధిగా ఆహారం కోసం గ్రామాల మీద పడేవి.
ఆ కోతుల స్ధావరం దగ్గరే ఉన్న ఓ మర్రిచెట్టు మీద ఓ పాలపిట్టల జంట కాపురం చేస్తుండేవి. రోజూ సాయంత్రంపూట ఆ కోతుల దండు చేసే వింత చేష్టలు ఆ పాలపిట్టల జంటకు వినోదం కలిగిస్తూ ఉండేది.
అది చలికాలం. ఓ సాయంత్రం పూట ఆ కోతులకి చలికాగాలన్న ఆలోచన కలిగింది. వెంటనే చెట్ల మీద ఎగురుతున్న మిణుగురుపురుగులను తీసుకొచ్చి కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి. మిణుగురు పురుగులనుండి వెలుగు తప్ప వేడి రాకపోవటంతో వాటికి ఏం చెయ్యాలో అర్ధం కాక బుర్రలు గోక్కోసాగాయి. వాటి అవస్ధ చెట్టు మీద పాలపిట్ట జంట చూసి నవ్వుకున్నాయి. ఆ జంటలోని మగపిట్ట 'పాపం! అవి మంట ఎలా పుట్టించాలో తెలియక బాధ పడుతున్నాయి. వాటికి వివరంగా చెప్పివస్తాను' అంది. అందుకు ఆడపిట్ట 'వద్దు! అవి కోతులు వాటికి విచక్షణా జ్ఞానం తక్కువ, వాటి మధ్యకు నువ్వు వెడితే నీకేదన్నా అపకారం తలపెడతాయి' అంది భయంగా. 'ఫర్వాలేదులే! అవి మరీ అంత మూర్ఖమైనవి కావు' అంటూ ఆ పాలపిట్ట రివ్వుమంటూ చెట్టుమీద నుంచి ఎగిరి ఆ కోతుల గుంపు మధ్యలో వాలింది. తమ మధ్యలో వాలిన ఆ పాలపిట్ట వంక గుర్రుగా చూసాయి గుంపులోని కోతులు. పాలపిట్ట అది పట్టించుకోకుండా 'మిత్రులారా! ఇవి పురుగులు వీటి వల్ల కొంచెం వెలుగు వస్తుంది కానీ వేడి రాదు. మీరు చలికాగాలంటే వెళ్ళి ఎండుకట్టెలు తెచ్చుకుని వాటిని చెకుముకిరాయిని రాజేసి వచ్చే నిప్పుతో అంటించండి. అపుడు మంట వచ్చి చలి తీరుతుంది' అంది. కోతులకి తమకి సలహా ఇవ్వటానికి పాలపిట్ట వచ్చిందని కోపం వచ్చింది. 'ఇంతలేవు నువ్వు మాకు సలహా యిస్తావా?' అంటూ ఆ పిట్టను పట్టుకుని పుటుక్కుమంటూ మెడను విరిచి చంపేసాయి.


పాపం ఆ పాలపిట్ట లోని ఆడపిట్ట 'మూర్ఖులకి సలహా యివ్వటం మంచిది కాదని చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ మగపిట్ట కోసం ఏడుస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది.
~
నీతి : మూర్ఖులకు సలహాలు ఇవ్వరాదు మరియు వారికి దూరంగా వుండుట మంచిది
^
source : పంచతంత్రం కథలు